Wednesday, September 21, 2011

అబ్బే ఈ మంట సరిపోదు......ఇంకా తగలేయండి


అలో...అలో....అలో  కచరాగారూ. ఏ ముహూర్తంలో మీకీ పేరు పెట్టానో కానీ స్టేట్ మొత్తాన్ని రోజు రోజుకూ కుప్పతొట్టి కన్నా హీనం చేసేస్తున్నారుగా. అబ్బే ఇది తిట్టడం కాదండీ. మీసమర్ధతని మెచ్చుకుంటున్నా. కాపోతే నాకో చిన్న డౌట్ ఈ సకల జనుల సమ్మె ఎవరి మీద కోపంతో ఎవరు చేస్తున్నట్టు? అహ నాకు తెలీక అడిగానంతే. అంటే బయట జనంలో (అదే లెండి బాబూ తెలంగాణా జనమే) టాక్ ఏంటంటే బస్సులు తిరగటం లేదు, ఆఫీసులు నడవటం లేదు, చివరాఖరికి పిల్లకాయల బళ్ళు కూడా తెరవటం లేదు. మా జీవితాల్ని నరకం చేస్తూ మాకోసమే సమ్మె అంటారేంటి ఈ బుర్ర తక్కువ సన్నాసులు (ఇది మాత్రం మీరు నేర్పించిన పదమే సుమండీ)? అనుకుంటున్నారు. నాకు తెలియక అడుగుతున్నానూ ఈ సమ్మె వలన ఒక్క సీమాంధ్ర వాడయినా ఇబ్బంది పడుతున్నాడా? ఆర్టీసీ బస్సులు లేక, ప్రైవేట్ వాహనాల అడ్డగోలు దోపిడీ భరించలేక ఈ సమ్మె ఆలోచన చేసిన వాడిని జనం (అక్షరాలా తెలంగాణా ప్రజలు) అమ్మ నా బూతులూ తిట్టుకుంటున్న సంగతి మీకు కనబడలేదా?  

అవును కచరా గారూ నిన్న ఓ బ్రహ్మాండమయిన స్టేట్ మెంట్ ఇచ్చారు. తెలంగాణా వచ్చాక ఇప్పుడు సమ్మె చేస్తున్న ఉద్యోగులందరికీ వడ్డీతో సహా జీతాలిస్తాం, తెలంగాణా వచ్చే దాకా ఈ సమ్మె ఆగదు అన్నారు. అబ్బ ఎంత సూపర్ డైలాగండీ అది! సూపరో సూపరు. అవునూ మరి మొన్నామధ్య మీరే 2014 దాకా తెలంగాణా వచ్చేలా లేదు అని బోలెడంత బాధపడిపోయిన విషయం ఈ సమ్మె చేస్తున్నా ఉద్యోగుల్లో ఒక్కడికీ గుర్తురాకపోవడం భలే చిత్రం సుమండీ. మరి ఊరికే అన్నారా వినేవాడు వీపీ జాన్ అయితే హరికథ మలయాళంలో చెప్తారని. 

ఇక స్కూళ్ళ విషయానికి వద్దాం. ఉద్యోగులకి అంటే పాపం డబ్బులే కాబట్టి వడ్డీతో సహా ఇచ్చేస్తారు. మరి పిల్లకాయల సంగతేంటి మాస్టారూ?. వాళ్ళు నష్టపోయిన, పోతున్న చదువులకి ఏ వెల కడతారు?  లేకపోతే ఉద్యోగులకి ప్రమోషన్ ఇచ్చినట్టుగా వీళ్ళకీ డైరక్ట్ గా డబుల్ ప్రమోషన్ ఇచ్చేసి ఆరో క్లాసు వాడ్ని ఎనిమిదో క్లాస్ కి, డిగ్రీ వాడ్ని పీజీకి ప్రమోట్ చేసేస్తారా? మీరు చేసినా చేసేయగలరు లెండి. మీ సొమ్మేంపోయింది? మీరంటే ఉదారమైన మనసుతో తెలంగాణా ప్రాంత ప్రజల అభివృద్ధి కాంక్షించి పిల్లకాయలు పరీక్షలు రాయకపోయినా పాస్ చేసేస్తాం అంటారు అనుకోండి మరి ఆ బిట్స్ , ఐ ఐ టి లాంటి సంస్థలు మార్కులు లేకపోయినా క.ఛ.రా గారు చెప్పారని ఓ ఎగేసుకుని చేర్చేసుకోవు కదండీ. అయినా పోయేదేం లేదు లెండి ఆ పరిస్థితి ఎదురయితే అది ఆంధ్రోళ్ళ కుట్ర అని కవర్ చేసేసుకోవచ్చు. ఉందిగా సర్వరోగ నివారిణి జిందా తెలిస్మాత్. కాపోతే ఈ మాట మరీ అన్నిటికీ వాడేయకండి సార్. మీ అనుచర గణానికి బాగా అలవాటయి చివరికి భార్య గర్భవతి అన్న వార్త విన్నా అలవాటులో పొరపాటుగా "ఇది ఆంధ్రోల్ల కుట్ర" అనేసినా అనేస్తారు. వినడానికి అంత బాగోదుగా. ఏటంటారు?

మీరేం అనుకోకపోతే నాదో సందేహం. ఏమీ అనుకోకూడదు మరి. అబ్బే ఏం లేదండీ. తెలంగాణా ప్రజలు అందరూ సమ్మెలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు అంటున్నారు కదా. మరి ఎక్కడ చూసినా గులాబీ జండాలు పట్టుకున్న మీ కార్యకర్తలే హడావుడి చేస్తున్నారు తప్ప మామూలు జనం ఆట్టే కనిపించటం లేదేంటి? చూడబోతే తె.రా.స. వాళ్ళు కాకపోతే వాళ్ళు తెలంగాణా వాళ్ళు కాదు అన్నట్టు కనిపిస్తోంది. (మనలో మనమాట అసలు మీనింగ్ అదే కదా). మొన్నామధ్య ఎవరో మామూలు పౌరుడు టీవీ వాళ్ళతో సమ్మె వలన ఇబ్బందులు చెబుతుంటే గులాబీయులు ఆ అర్భకుడిని అడ్డుకున్న తీరు, నేనూ తెలంగాణా వాడినే మొర్రో అని వాడు మొత్తుకుంటున్నా వాడి నోరు నొక్కేసిన తీరు చూసి ఒక్క సారి హిట్లరు గుర్తోచ్చాడంటే నమ్మండి. మీరు సూపరెహే!!

ఇక ఈ మధ్య "సీమాంధ్ర ప్రభుత్వం" అని ఇంకో మాట వింటున్నానండోయ్. పదం బావుంది కానీ మంత్రి వర్గంలో తెలంగాణా మంత్రుల్ని పెట్టుకుని సీమాంధ్ర  ప్రభుత్వం అంటే ఆట్టే బాగోదేమో ఆలోచించండి. మీరంటే నోటికి ఎంతోస్తే అంత అంటారు కాబట్టి ఓ.కే అనుకోవచ్చు. స్వయంగా మంత్రి వర్గంలో ఉండి ఈ ప్రభుత్వం చేత కానిది, చేవలేనిది, దద్దమ్మ, సీమాంధ్ర ప్రభుత్వం వగైరా వగైరా అని అనర్ఘళంగా స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మంత్రుల్ని చూస్తే నవ్వాపుకోలేక చస్తున్నా. 

తెలంగాణా కోసం రాజీనామా చేయని నాయకులని తరిమి కొట్టండి, రాజీనామాలు ఆమోదించుకోనివారు చవట దద్దమ్మలు అని మీరు, మీ తోక (అదేలెండీ కో.రా) నినాదాలు ఇచ్చేసరికి ఓ ఎగేసుకుంటూ కాంగ్రెస్, తె.దే.పా ఎంపీలని, ఎమ్మెల్యేలని ఘోరావులు గట్రా చేస్తున్న మీ పార్టీ కార్యకర్తలకి తమరు, తమ అనుంగు పదో చెల్లి, తమ కుమారుడు, తమ మేనల్లుడు చేసిన రాజీనామాలు కూడా ఆమోదం పొందలేదని, వాటిని ఆమోదింపచేసుకునే ప్రయత్నం తమరు కుసింత కూడా చేయలేదని, కాబట్టి తమరూ, తమ పరివారం కూడా సోకాల్డ్ "చవట దద్దమ్మల" క్యాటగిరీలోకి వస్తారని గుర్తులేకపోవడం భలే చిత్రం సుమండీ. జనాల్ని గొర్రెలతో పోల్చారంటే పోల్చరూ మరి. 

మనలో మనమాట, మొన్న పదిహేడో తారీఖున తెలంగాణా విమోచన/ విలీన/విద్రోహ (ఏంటో ఇదెప్పుడూ నాకు కన్ఫ్యూజనే ఒక్కోసారి ఒక్కో మాట వాడతారు మీరు) దినాన సోకాల్డ్ అంద్రోల్లయిన బాబుగారు తె.దే.పా పార్టీ ఆఫీసులోను, బొత్సబాబు గాంధీ భవన్ లోనూ జండాలు ఎగరేశారు కదా మరి మీరేంటి సార్ లాస్ట్ ఇయరు, ఈ ఇయరు ఎక్కడా పత్తాలేరు? అంత ముఖ్యమయిన రోజున జండా ఎగరేసి మైకు ముందు విశ్వరూపం చూపిస్తారని ఆశగా ఎదురుచూశా. మీరు చూస్తే గప్ చుప్ సాంబార్ "బుడ్డి" అని సైలెంట్ గా ఉన్నారు. పోనీ పార్లమెంటులో ఎప్పుడైనా చించేసారా అంటే మొట్టమొదటి సారి గత సమావేశాలలో ఏదో రెండ్రోజులు మీరు, మీ పదో చెల్లి కుసింత హడావుడి చేసి ఢిల్లీ మీడియా ఫొటోలకి ఫోజులిచ్చి చక్కా వచ్చారు. ఈసారి అసలు సమావేశాలకి హాజరయ్యారో లేదో డౌటే. బహుశా మీకేమయినా "చట్టసభాఫోబియా" ఉందేమో డాక్టర్ కి చూపించుకోండి. రాజీనామా చేశాను కాబట్టి ఈ సారి వెళ్ళలేదు అంటారా? అది ఆమోదించబడలేదుగా :)). సర్లెండి మీ ఇష్టం మీది. 

అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే ఎలాగూ రాష్ట్రాన్ని తగలెట్టడం మొదలెట్టారు కాబట్టి ఆ తగలేట్టేదేదో మళ్ళీ కోలుకోకుండా పూర్తిగా తగలేట్టేయండి. అఫ్కోర్స్ ఆ ముక్క నేను మీకు చెప్పక్కర్లేదనుకోండి. ఇంక ప్రభుత్వం అంటారా? పేపర్లలో ఆ పదం చూడటం తప్ప అలాంటిది అంటూ ఒకటుందని ప్రజలతో పాటూ సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రే మర్చిపోయారు. స్పీకర్ని తీసుకొచ్చి సీయం చేస్తే అసెంబ్లీలో లాగానే ఆయన నోటికొచ్చిన నాలుగు ముక్కలు "ప్లీజ్", "గొడవ చేయకండి", "సైలెన్స్", "ఇలా అయితే ఎలా?" తోనే నెట్టుకొచ్చేస్తున్నాడు. కాబట్టి మీకు ఎదురు లేదు. రెచ్చిపోండి. జనం సంగతి మీరెప్పుడు పట్టించుకున్నారు?

కొసమెరుపు: మీరు మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని టీవీల్లో స్క్రోలింగ్ తో పాటూ "మీ ఆరోగ్యం సహకరించని దృష్ట్యా ఆ ఆలోచన మానుకోమని చెబుతున్నామని, తెలంగాణా కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని" తమ అనుంగు కుమార్తె కవిత గారి స్టేట్మెంట్ ఎలా అర్ధం చేసుకోవాలో కుసింత వివరిద్దురూ. అయినా కామెడీ కాకపోతే ఆకలేసే దాకా ఆమరణనిరాహార దీక్ష చేసే దానికి పిచ్చి జనం, మీడియా ఇంత హడావుడి చేయడం ఎందుకండీ? :)